నారీమణులే నిర్ణేతలు..
పట్టణ ఓటర్లు 1,01,085 మహిళలు: 52,110, పురుషులు: 48,968
నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికం
సాక్షి, సిద్దిపేట: మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే గెలుపోటములపై ప్రభావం చూపనుంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం గతేడాది ముగిసింది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం మే నెలతో ముగియనుంది. ఆ నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమయాత్తమవుతోంది. అందులో భాగంగా ఓటరు తుది జాబితాను సోమవారం ప్రకటించగా, మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో వార్డుల వారీగా అప్లోడ్ చేశారు. ఈ నెల 16న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను ఆయా వార్డులలో ప్రదర్శించనున్నారు.
నాలుగు మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 52,110, పురుషులు 48,968, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఓటరు జాబితాను ఫైనల్ చేయగా ఇక రిజర్వేషన్ల పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో రిజర్వేషన్లను ప్రకటించే అవకాశాలున్నాయి. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వేగంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతుండటంతో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.
మున్సిపాలిటీ మహిళలు పురుషులు ఇతరులు మొత్తం
హుస్నాబాద్ 9,873 9,348 06 19,227
దుబ్బాక 11.117 10,224 0 21,341
గజ్వేల్ 24,001 22,738 01 46,740
చేర్యాల 7,119 6,658 0 13,777


