ఆస్పత్రి ఆవరణలో చెప్పుల కుప్ప తొలగింపు
సిద్దిపేటకమాన్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చెప్పుల కుప్పను తొలగించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఆవరణలో చిందర వందరగా చెప్పులు ఉండటం.. కొన్ని మాయం కావడంతో ‘ఎవరికి చెప్పుకునేది?’ అనే శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు తక్షణం చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలోని చెప్పుల కుప్పను శానిటేషన్ సిబ్బంది చేత తొలగించి, ట్రాలీ ఆటో ద్వారా తరలించారు. ఉన్న వాటిని క్రమపద్ధతిలో ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చే వారు ఎక్కడ పడితే అక్కడ పాదరక్షలు వదిలివెళ్లకూడదని, రాక్లో మాత్రమే విడిచి వెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు.


