అంతటా మనోళ్లే గెలవాలి
గజ్వేల్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను చాటాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం పేదలకు ఎదురుచూపులే మిగిలాయన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో విభేదాలను పక్కనబెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడమే కార్యకర్తలు, నాయకుల లక్ష్యం కావాలన్నారు.
ఏకగ్రీవ సర్పంచ్లకు సన్మానం
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లను మంత్రి సన్మానించారు. జగదేవ్పూర్ మండలం నిర్మల్నగర్ సర్పంచ్ కత్తి పద్మారావు, కొండాపూర్ సర్పంచ్ పుష్ప, పలుగుగడ్డ సర్పంచ్ కనకయ్య, వర్గల్ మండలం తున్కిమక్త సర్పంచ్ స్వామి, కుకునూర్పల్లి మండలం పీటీ వెంకటాపూర్ సర్పంచ్ భాస్కర్ తదితరులు సన్మానం పొందిన వారిలో ఉన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి
అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలు
విభేదాలను పక్కనబెట్టి పనిచేయండి
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్
‘స్థానిక’ంగా కాంగ్రెస్ జోష్..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిందని మంత్రి వివేక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తున్న పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కాంగ్రెస్ మద్దతు దారులే విజయం సాధిస్తారన్నారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తు ఇమామ్, సాకి ఆనంద్, కలీముద్దీన్, బొమ్మల యాదగిరి, భిక్షపతి గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


