
రైతులను ఆదుకుంటాం
● అకాల వర్షంతో తీరని నష్టం ● ఎకరాకు రూ.10వేల పరిహారం ● మంత్రి పొన్నం ప్రభాకర్
గాంధీ కుటుంబాన్ని కేంద్రం వేధిస్తోంది
● విచారణ పేరిట రాక్షసత్వం తగదు ● మంత్రి పొన్నం ప్రభాకర్
అక్కన్నపేట(హుస్నాబాద్): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండలం పంతుల్తండాలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి బుధవారం పరిశీలించారు. అలాగే అక్కన్నపేట, గొల్లకుంట, అంతక్కపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఎకరాకు రూ.10వేల పరిహారం అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగళ్ల వాన వల్ల కూరగాయాల పంటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తోందన్నారు. గౌరవెల్లి నీళ్లు వచ్చినట్లయితే ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులందరూ ఆయిల్పామ్ తోటలు పెట్టాలని, పంట సాగుపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే కూరగాయాల పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ మండలాధ్యక్షుడు అయిలయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కరంటోతు రవీ, నాయకులు పాల్గొన్నారు.
హుస్నాబాద్: సోనియా గాంధీని విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాక్షసత్వంగా వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంఽధీలపై ఈడీ చార్జిషీట్లను నిరసిస్తూ బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి ధర్నా చేపట్టారు. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్య్రం కోసం పని చేసిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. దేశంలో అనేక మంది నిరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలు ఎల్ఐసీ, ఎయిర్పోర్ట్, రైల్వేలు, అన్ని ఆర్థిక సంస్థలను అదాని, అంబానీలకు అప్పగిస్తున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంట ప్రజలు ఉన్నారని, దేశమంతా ముక్తకంఠంతో మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

రైతులను ఆదుకుంటాం