మహిళల రక్షణకే ‘భరోసా.. స్నేహిత’
సిద్దిపేట సీపీ శ్వేత
సిద్దిపేటకమాన్: లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలకు భరోసా, స్నేహిత మహిళ సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్నామని సిద్దిపేట పోలీస్కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. సిద్దిపేట భరోసా, స్నేహిత మహిళ సెంటర్ సిబ్బందితో మహిళలకు అందిస్తున్న సేవలపై బుధవారం సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పించడంతో పాటు న్యాయసలహాలు, పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. భరోసా కేంద్రంలో ఇప్పటి వరకు 93 పోక్సో కేసులు, 28 అత్యాచార కేసులు, 5 మిస్సింగ్ కేసుల్లో మొత్తంగా 126 మంది బాధితులకు భరోసా కల్పించామన్నారు. 29 మంది బాధితుల ఇళ్లు సందర్శించి, వివిధ గ్రామాలు, పట్టణాల్లో 15 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 2015 నుంచి ఇప్పటివరకు 184 మంది మహిళలకు ప్రభుత్వం నుంచి రూ.65,45,000 ఆర్థికసాయం అందించామని, స్నేహిత మహిళ సెంటర్లో గృహహింస, వివిధ వేధింపులకు గురవుతున్న మహిళలకు సంబంధించి 247 దరఖాస్తులు రాగా, 199 మందిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. మహిళలు ఏమైనా వేధింపులకు గురైతే స్నేహిత మహిళ సెంటర్కు చెందిన 9494639498 నంబరులో సంప్రదించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, మహిళ పోలీస్స్టేషన్ సీఐ దుర్గ, భరోసా సెంటర్ సిబ్బంది వినోద, అనూష, సౌమ్య, హరిత, రేణుక, భవాని, నవనీత, భ రోసా, స్నేహిత మహిళ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.