మాజీ మంత్రి హరీశ్రావు
నంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న రైతు డిస్కం ఉచిత విద్యుత్కు ఉరితాడులా మారుతుందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. పొద్దున సూర్యుడు వచ్చిన తర్వాత మోటార్లు ఆన్ అయి, సాయంత్రం 5 గంటలకు ఎండపోగానే బంద్ అవతాయని ఆరోపించారు. శనివారం పాలమాకులలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ముండ్రాయిలో రైతులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ పాలనలో చిన్న సమస్య వచ్చినా మెసేజ్ పెట్టగానే పరిష్కారమయ్యేదని, నేడు పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల ధరలు నేలచూపు చూస్తుండటంతో పిల్లల ఫీజులు కట్టలేక అల్లాడుతున్నారన్నారు. రైతు డిస్కంకు సోలార్ పవర్ మాత్రమే కేటాయించడంతో రోజుకు 7, 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రైతులను ఆదుకుంటామని గొ ప్పలు చెప్పిన ప్రభుత్వం రైతుబంధుకు ఎగనామం పెట్టిందని ఎద్దేవా చేశారు.


