మద్దూరు(హుస్నాబాద్): యువ అంతర్జాతీయ పర్వతారోహకుడు మాస్టర్ జాటోత్ విహాన్రామ్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ తెలంగాణ అవార్డ్స్ –2026 కార్యక్రమంలో భాగంగా ఆయనకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డును ప్రముఖ నటి హెబ్బా పటేల్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విహాన్రామ్ మాట్లాడుతూ... తన విజయాలకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించి, భారతదేశ జాతీయ పతాకాన్ని ప్రపంచ అత్యున్నత శిఖరాలపై ఎగురవేయడమే తన లక్ష్యమని తెలిపారు.
చిన్నారికి గిన్నిస్ బుక్
రికార్డులో చోటు
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్ర ప్రసాద్ కూతురు చిన్నారి ప్రాణ్యకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు దక్కింది. ఈ విషయాన్ని శనివారం చిన్నారి తండ్రి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో నిర్వహించిన కీబోర్డు ప్రతిభ పోటీల్లో ప్రాణ్య పాల్గొని గంట పాటు కీబోర్డును ఆపకుండా వాయించి రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో 22 దేశాల నుంచి 2వేలు మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొనగా, ఇందులో ప్రతిభ చూపిన 777 మందికి రికార్డుల్లో చోటు లభించిందని వివరించారు. ఈనెల 29న హైదరాబాద్ గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేసినట్లు ఆయన తెలిపారు.
మహిళ మృతదేహం లభ్యం
సంగారెడ్డి క్రైమ్: పట్టణంలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని ఫైర్ శాఖ ఆఫీస్ ఎదురుగా ఈ నెల 27న ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ(55) మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా, చిలిపిచెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన వడ్డే ఎల్లమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చెరువులో దూకి
మహిళ ఆత్మహత్య
మర్కూక్(గజ్వేల్): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని చేబర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ దామోదర్, గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దేశమైన లక్ష్మి(60) కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయి గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో దూకింది. శవమై కనిపించడంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.


