ఉపాధి కూలీల వెతలు
దాదాపు రూ.6వేలు రావాలి
ఉపాధి పనులు చేస్తున్నా డబ్బులు రావడంలేదు. దాదాపు రూ. 6వేలు రావాలి. కూలి డబ్బుల కోసం రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అధికారులను అడిగితే ఇంకా పడలేదు అని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి కూలి డబ్బులు త్వరగా చెల్లించాలి.
– ముత్యాలు, ఉపాధి హామీ కూలి,లింగుపల్లి, మిరుదొడ్డి
త్వరలో జమ అవుతాయి
పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో జమఅవుతాయి. రోజు పనులకు వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. కూలి పని కి వచ్చిన వారందరికీ తప్పకుండా డబ్బులు చెల్లించడం జరుగుతుంది.
– జయదేవ్ ఆర్యా, డీఆర్డీవో, సిద్దిపేట
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కూలీలు డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.2.95కోట్లు పెండింగ్లో ఉన్నాయి. డబ్బుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో ఉపాధి పనులకు కూలీలు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. – సాక్షి, సిద్దిపేట
గ్రామాల్లో రైతులకు, కూలీలకు ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5,69,156 జాబ్ కార్డులుండగా 10,84,409 మంది ఉపాధి కార్మికులున్నారు. అందులో 5,59,118 మంది యాక్టివ్ కూలీలున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పనిలోకి వచ్చిన కూలీ పేరు, చేసిన పరిమాణాన్ని రోజూ ఫీల్డు అసిస్టెంట్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఉదయం 8గంటలకు ఒక సారి ఫొటో దిగితే , మళ్లీ మధ్యాహ్నం 12గంటలకు (కనీసం 4గంటలు గ్యాప్) ఫొటో దిగాలి. అప్పుడే ఉపాధి కూలీకి డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి.
కేవైసీ కొర్రీలతో..
ప్రతి 15 రోజులకు ఒక సారి కూలి డబ్బులు కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమకావాలి. కానీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి డబ్బులు జమ కావడం లేదు. గత రెండు నెలలుగా కూలి డబ్బులు అందక, ఈ కేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 2,95,49,000లు పెండింగ్లో ఉన్నాయి. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా పరిహారాన్ని అందించాలి. ఉపాధి కూలీలకు డబ్బులు వెంటవెంటనే అందిస్తే ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి త్వరగా కూలి డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
రెండు నెలలుగా నిలిచినడబ్బుల చెల్లింపులు
పెండింగ్లో రూ.2.95కోట్లు
ఎదురుచూస్తున్న కూలీలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోజాబ్ కార్డులు 5.69లక్షలు


