ప్రభుత్వ కళాశాలల్లో తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం
● ప్రథమ సంవత్సరంలో 31.73 శాతం మాత్రమే.. ● సరైన కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడమే.. ● విద్యార్థులను చేర్పించేందుకు వెనకాడుతున్న తల్లిదండ్రులు
సంగారెడ్డిఎడ్యుకేషన్: ప్రతీ విద్యార్థికి ఉన్నతమైన విద్య అందించడంలో భాగంగా ప్రతీ మండల కేంద్రానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అయితే అనుకున్న ఫలితాలను రాబట్టడంలో విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం రోజురోజుకూ తగ్గుతోంది. ఇంటర్మీడియెట్ బోర్డు అఽధికారులు విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 19వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రథమ సంవత్సరం ఫలితాలలో కేవలం నాలుగు కళాశాలలు మాత్రమే 50 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో కల్హేర్ 94.52, మనూర్ 78.43, కంగ్టి 63.51, పుల్కల్ 50 శాతం మాత్రమే సాధించాయి. ప్రభుత్వ కళాశాలలో ఎంత నాణ్యమైన విద్య అందుతుందో ఈ ఫలితాలను చూసి అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి.


