రెండున్నర గంటల పాటు పర్యటన
లాంఛనంగా పామాయిల్ పరిశ్రమ ప్రారంభం
సిద్దిపేటజోన్ / సిద్దిపేట కమాన్ /నంగునూరు(సిద్దిపేట): ప్రజాపాలనలో రైతు మహోత్సవం పేరిట ఆదివారం నంగునూరు మండలం నర్మేటలో నిర్వహించిన సీఎం సభ విజయవంతమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు, సిద్దిపేట జిల్లా మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రూ.300 కోట్లలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం మంత్రులతో కలిసి వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.141 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో యూజీడీ పథకం, రూ.200 కోట్లతో కొండపాక మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.16.62 కోట్లతో మర్కుక్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్స్కూల్కు శంకుస్థాపన చేశారు. రూ.78 కోట్లతో నిర్మించిన జైల్, రూ.15 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆయూష్ ఆస్పత్రి, రూ.3.60 కోట్లతో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్, రూ.1.43 కోట్లతో గట్లమల్యాలలో నిర్మించిన పీహెచ్సీ భవనం, సిద్దిపేటలో రూ.1.43 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాలకు సీఎం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ... రాజకీయాలు ఎన్నికల వరకేనని, అనంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు కూడా సమానంగా కేటాయించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండున్నర గంటల పాటు సాగింది. మొదట హెలిక్యాప్టర్లో సీఎం నర్మేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో వెళ్లి పామాయిల్ పరిశ్రమను ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత పరిశ్రమను పరిశీలించారు. అక్కడే కొనసాగుతున్న రైతు మహోత్సవంలోని స్టాళ్లను సందర్శించి వాటి గురించి తెలుసుకున్నారు. బ్యాటరీ వెహికిల్లో తిరిగారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు వర్చువల్గా ప్రారంభించారు. సాయంత్రం 4.11గంటలకు సభా వేదికకు సీఎం చేరుకున్నారు. రైతు భరోసాను విడుదల చేసి, బహిరంగ సభలో దాదాపు 43 నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి సాయంత్రం 6గంటలకు హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు బయలు దేరారు. సీఎం ప్రసంగాన్ని రాష్ట్రంలోని 1600 రైతుల వేదికల ద్వారా 4లక్షల మంది రైతులు విన్నారు.
రూ.750 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన
స్టాళ్లను పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎంపీలు
సమస్యలపై సీఎంకు ఎంపీ రఘునందన్ వినతి


