రికవరీ శాతం ఎక్కువ..
● గణపతి కర్మాగారంలో 4.20 లక్షలు
● ‘గోదావరి గంగా’లో 2.30లక్షల టన్నుల మేర గానుగ
● పెరిగిన రికవరీ శాతం
చెరుకు క్రషింగ్
జహీరాబాద్: జిల్లాలోని రెండు చక్కెర కర్మాగారాల్లో చెరుకు క్రషింగ్ను ముగించారు. ఆయా కర్మాగారాలు 6.50లక్షల టన్నుల చెరుకును గానుగాడించాయి. సంగారెడ్డిలోని గణపతి చక్కెర కర్మాగారం 2025–26 సీజన్కు గాను 4,20,076 టన్నుల చెరుకును క్రషింగ్ చేయగా.. 4,70,700 క్వింటాళ్ల చక్కెరను ఉత్పత్తి చేసింది. రాయికోడ్ మండలంలోని మాటూర్లో గల గోదావరి గంగా కర్మాగారం 2,29,206 టన్నుల చెరుకును క్రషింగ్ నిర్వహించగా, 2,50,914 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి చేసింది. గణపతి కర్మాగారం గత ఏడాది కంటే 9,909 టన్నుల చెరుకును తక్కువగా గానుగాడించింది. జోన్ పరిధిలో చెరుకు పంట తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గోదావరి గంగా మాత్రం గత ఏడాది కంటే 1,13,702 టన్నులు అధికంగా క్రషింగ్ చేసింది. ఈ కర్మాగారం గత సీజన్లో కొత్తగా ఏర్పాటైంది. దీంతో కర్మాగారం ఆలస్యంగా క్రషింగ్ను మొదలు పెట్టింది. ఈ ఏడాది మాత్రం ఆశించిన మేరకు క్రషింగ్ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం చెరుకు పంటను సమీపంలోని కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్లో గల గాయత్రి కర్మాగారానికి తరలించారు. ఈ కర్మాగారం 3,95,427 టన్నుల చెరుకును గానుగాడించింది. గత ఏడాది గణపతి కర్మాగారం 11.05 శాతం రికవరీ కాగా, ఈ ఏడాది 11.20 శాతం రికవరీ సాధించింది. గోదావరి గంగా గత ఏడాది 10.41 శాతం కాగా ఈ ఏడాది 11 శాతం రికవరీ చేసింది. గాయత్రి గత ఏడాది 10.90 శాతం రికవరీ సాధించగా, ఈ ఏడాది 11 శాతం రికవరీ సాధించింది. ఈ ఏడాది వేసవి ఎండలు ముదరక ముందే క్రషింగ్ను ముగించడంతో రికవరీ శాతం పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గత మూడు సీజన్ల నుంచి మూతపడింది. వచ్చే ఏడాది క్రషింగ్ను చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇటీవల ట్రయల్రన్ను సైతం విజయవంతంగా నిర్వహించింది.


