ప్రశాంత్నగర్(సిద్దిపేట): వివిధ సేవా రంగాల్లో రాణిస్తున్నందుకు చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉగాది సేవా పురస్కారం పొందినట్లు పద్మశాలి సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ, చేనేత ఐక్యవేదిక జిల్లా సలహాదారు గోనె మార్కండేయులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి బాబుమోహన్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ పురస్కారం అందించినట్లు పేర్కొన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): శనివారం రాత్రి యువకుడు భూమిపూజ చేసిన స్థలంలో మూత్రవిసర్జన చేయగా, యువకులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నార్సింగి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేసిన స్థలంలో ఆదివారం హిందూ సంఘాల నాయకులు పంచామృతాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అపవిత్రం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ ఉపసర్పంచ్ యోగి, నాయకులు ఆంజనేయులు తదితరులున్నారు.
మెదక్జోన్: మెదక్ పట్టణంలో ఎనిమిది రోజుల వ్యవధిలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయని పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. వివరాలు ఇలా... ఈ నెల 14న, పట్టణంలోని చర్చి గేట్ సమీపంలో 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సుగల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొన్ని రోజులుగా మెదక్లో భిక్షాటన చేసినట్లు గుర్తించారు. అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించగా నేటికి అతనికి సంబంధించిన వారు ఎవరు రాలేదని తెలిపారు. అలాగే మరో ఘటనలో ... ఆదివారం పట్టణంలోని జంబికుంట నాగిని చెరువు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉందని, మృతుడు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని చెప్పారు. మృతదేహంపై నల్లరంగు ప్యాంటు, తలపై ఎరుపు రంగు టవల్ ఉంది. శవాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో బద్రపరిచినట్లు చెప్పారు.
చేగుంట(తూప్రాన్): మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన మక్క నర్సింహులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య స్రవంతి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 18న ఏడాది వయసున్న చిన్నారిని తీసుకొని ఆమె బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువుల వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు.
సంగారెడ్డి క్రైమ్: ఈ నెల 21న లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... మృతురాలు సంగారెడ్డి పట్టణంలోని నలంద నగర్కు చెందిన లక్ష్మిగా(45) గుర్తించారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈనెల 20న ఊరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మహబూబ్ సాగర్ చెరువులో మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలించి లక్ష్మిగా గుర్తించారు.


