● పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు వద్దు
● గ్రామసభలో చర్చపై గ్రామస్తుల ఆగ్రహం
చిన్నశంకరంపేట(మెదక్): నూతన పరిశ్రమకు అనుమతి ఇవ్వొద్దని గ్రామస్తులు తేల్చి చెప్పారు. శుక్రవారం మండలంలోని చందంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రవీణ్కుమార్, గ్రామ కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ ప్యాక్ టెక్ పరిశ్రమ అనుమతి కోసం గ్రామసభలో అభిప్రాయాలు కోరారు. గతంలో పరిశ్రమ వద్దని తీర్మానం చేశామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే పాలకవర్గం డబ్బులు తీసుకున్నదని ఎన్నికల సమయంలో ప్రచారం చేసి, ఆ పరిశ్రమ గూర్చి ఎందుకు చర్చ పెట్టారని మాజీ ఎంపీటీసీ శివకుమార్ నిలదీశాడు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటుకు తాను వందశాతం వ్యతిరేకమన్నారు. తాజాగా పరిశ్రమ యజమాన్యం ఇన్చార్జి మంత్రిని కలిసి వినతిపత్రం అందించారని, దీంతో డీపీఓ జీపీ వివరణ కోరుతూ నోటీసులు పంపించడంతో గ్రామసభలో ప్రజల అభిప్రాయం కోరినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసుకునేందుకు సిద్ధపడగా సముదాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంపై సర్పంచ్, గ్రామ కార్యదర్శి ప్రకటించి గ్రామసభను ముగించారు.


