● కాలుష్య జలాలే కారణం
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
హత్నూర (సంగారెడ్డి): మంజీరా నదిలోని చేపలు మృత్యువాత పడ్డాయి. వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున మృతి చెందుతున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా... నక్క వాగు నుంచి వస్తున్న కాలుష్య జలాలు మంజీరా నదిలో కలవడం వల్ల నీరు కలుషితమై చేపలు మృతి చెందుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. చుట్టుపక్కల పరిశ్రమలతో పాటు పటాన్చెరు, పాషా మైలారం, ఎగువనున్న ప్రాంతం నుంచి కాలుష్య జలాలు నక్క వాగు ద్వారా రావడంతో నది జలాలు కలుషితమవుతున్నాయి. అలాగే చేపలతోపాటు మూగజీవాలు నీరు తాగి మత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చేపలు మృతి చెంది కొట్టుకుపోవడంతో పాటు ఎక్కడపడితే అక్కడ మంజీరా నదిలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. కాగా పరివాహక ప్రాంతాల ప్రజలు కాలుష్య జలాలతో పంట పొలాలు సైతం పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మంజీరా నదిలో నక్క వాగు కాలుష్య జలాలు కలవకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.


