దుబ్బాక: దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ శివారులో మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు పడిన గండికి శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. కాగా మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు భారీ గండి అనే శీర్షికన సాక్షి ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో ఇరిగేషన్ డీఈఈలు శ్రీకాంత్, హరికిషన్ గండి పడిన కాలువకు దగ్గరుండి మరమ్మతులను స్వయంగా పర్యవేక్షించారు. గండిపడిన చోట టిప్పర్లతో మట్టిని తెప్పించి నింపుతున్నారు. ఇసుక, సిమెంట్ బస్తాలతో గండిని శనివారం మధ్యాహ్నంలోపు పటిష్టంగా మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు. భారీ గండి పడటంతో రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంతో పాటు దుబ్బాక మండలంలోని పలు గ్రామాలకు నీటిని అధికారులు నిలిపివేశారు. కాలువకు గండిపడి భారీగా నీరు సమీపంలోని కుందుల చెరువులోకి చేరింది. దీంతో కాలువపై ఆధారపడ్డ రైతులు పంటలకు నీరు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. కాగా కాలువకు యాదృచ్చికంగా గండి పడలేదని, కావాలనే కొంత మంది గండి పెట్టినట్లు అనుమానాలు ఉన్నట్లు డీఈ శ్రీకాంత్ తెలిపారు. గండి పడిన సంఘటనపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


