ఆశ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మంత్రి దామోదర ఇంటిని ముట్టడించిన ఆశాలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని
ఆశ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ...సమస్యలు పరిష్కరించమంటే ఆశా వర్కర్లను అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లపై పనిభారం పెంచింది కానీ వేతనాలు మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు అమలు చేయాలిః సాయిలు
ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని ఆశా వర్కర్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆశాలకు నెలకు రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని, 20 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పీఏ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.యాదగిరి, అధ్యక్షురాలు శశికళ, యశోద, నాయకులు మంజుల, హైమావతి ప్రశాంతి, గంగా, వరలక్ష్మి, వీరమణి, నందమ్మ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


