● వైద్య సిబ్బందికి శిక్షణ ● హాజరైన కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్/ సంగారెడ్డి ఎడ్యుకేషన్/ సంగారెడ్డి : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (డీహెచ్పీ) అమలుకు శ్రీకారం చుట్టగా, సంబంధిత సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రోగుల పూర్తి వైద్య వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు సంబంధించి డేటాఎంట్రీ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ...సంగారెడ్డి డివిజన్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను ప్రారంభిస్తున్నామని, జీజీహెచ్, జోగిపేట్, పటాన్చెరు ఏరియా ఆస్పత్రులు, సదాశివపేట సీహెచ్సీతోపాటు సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 పీహెచ్సీలలో సోమవారం నుంచి ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వసంతరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డాక్టర్ శశాంక్, స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు
జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అధికారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పదోతరగతి పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందు ప్రతీ హాలును క్షుణ్ణంగా పరిశీలించి చూడాలని సూచించారు.


