పురపోరుకు కసరత్తు
11 మున్సిపాలిటీలు..
252 వార్డులు..
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ఈ సంవత్సరం జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారులను నియమించి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం మున్సిపల్ పోరు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
జాబితా ప్రక్రియ ఇలా...
● రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం మున్సిపాలిటీల వారీగా పోలింగ్ కేంద్రాలను పునర్ వ్యవస్థీకరణ చేస్తూ కొత్త వాటిని గుర్తించారు. ఈనెల 31న మున్సిపల్ పరిధిలోని వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను రూపొందిస్తారు. 2025 జనవరి 10న విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రస్తుత జాబితాను రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1న పోలింగ్ కేంద్రాలతో పాటు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. జాబితాను ఏ విధంగా తయారు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు.
● ముసాయిదా ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈనెల 5న మున్సిపల్ కార్యాలయాలలో కమిషనర్ సమావేశం నిర్వహించాలి. 6న జిల్లా కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన సమావేశం ఉంటుంది.
● విడుదల చేసిన ఓటరు జాబితాలో ఒక వార్డు నుంచి మరో వార్డుకు ఓటర్లను వారి ఫిర్యాదుల మేరకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఓటరు ఒకే వార్డులో ఉండే విధంగా చూస్తున్నారు.
● వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 10న తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలు మున్సిపల్ వార్డుల వారీగా వెల్లడిస్తారు.
జీహెచ్ఎంసీలో విలీనంతో తగ్గిన మున్సిపాలిటీలు
జనవరి 10న తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లోని 252 వార్డులకు ఓటరు జాబితా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అలాగే పలు గ్రామాలను కలిపి గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, కోహిర్, ఇస్నాపూర్, జిన్నారం కొత్త మున్సిపల్గా ఏర్పాటు చేశారు. కాగా బొల్లారం, తెల్లపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు.


