సమన్వయంతోనే అభివృద్ధి
జడ్పీ డిప్యూటీ సీఈవో స్వప్న
హత్నూర (సంగారెడ్డి): నూతన సర్పంచులు అధికారుల సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న అన్నారు. మంగళవారం హత్నూర రైతు వేదికలో మండలంలోని నూతనంగా ఎన్నికై న సర్పంచుల పరిచయ కార్యక్రమంలో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, ఏఈ శ్రీనివాస్, ఏపీఎం రాజశేఖర్, నరేంద్ర,అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ
ఈఓ డా.ప్రభాకర్
వట్పల్లి(అందోల్): పాడి పశువుల్లో తగు మెలకువలు పాటిస్తే గర్భకోశ వ్యాధులను సమూలంగా నివారించవచ్చని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ డా.ప్రభాకర్ అన్నారు. మంగళవారం అందోల్ మండల పరిధిలోని కొడెకల్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స, లేగ దూడలకు, మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు తాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు సకాలంలో ఎద గుర్తించి, లింగ నిర్ధారణ, ఎద సూదులు వేయించడం ద్వారా 90 శాతం ఆడ దూడలు పుట్టే అవకాశం ఉందన్నారు. దీని వల్ల రైతుకు లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా.విహారిక, ఉప సర్పంచ్ యాదవ రెడ్డి, గోపాల మిత్ర సూపర్ వైజర్ సి.అర్జునయ్య, గోపాల మిత్రలు, ప్రభు, నాగరాజు, సబార్డినేటర్ ప్రతాప్, రైతులు పాల్గొన్నారు.
వేం నరేందర్రెడ్డికి నర్సారెడ్డి వినతి
గజ్వేల్: మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంచాలని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ విలీనమై ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 20 వార్డులకు మరో 15 వార్డులను పెంచడానికి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ప్రస్తుతం పాత వార్డుల్లోనే నిర్వాసిత కాలనీ ఓట్లను విలీనం చేయడం వల్ల ఒక్కో వార్డులో 2,300 నుంచి 2,500వరకు ఓటర్ల సంఖ్య పెరిగి పరిపాలనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించేలా చూడాలని కోరారు.
సమన్వయంతోనే అభివృద్ధి


