ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా నూతన డివిజన్లు
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, పటాన్చెరు కేంద్రంగా జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ ఆర్.వీ కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ను కలిసి నూతన డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో లక్ష 20 వేలకు పైగా ఓటర్లు, రెండు లక్షల జనాభా నివసిస్తుందని తెలిపారు. పాత అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ కలిపి కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని.. పరిపాలన వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం కిష్టారెడ్డిపేట, బీరంగూడ, అమీన్పూర్, పీజేఆర్ కాలనీల పేరిట 30 వేల ఓటర్లకు అనుగుణంగా నాలుగు డివిజన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో తెల్లాపూర్, ముత్తంగి డివిజన్లు ఏర్పాటు చేశారని.. వీటి పరిధిలో గల రెండు పడక గదుల ఇళ్ల సముదాయాల ఓటర్లకు అనుగుణంగా తెల్లాపూర్, వెలిమల, కొల్లూరు, ముత్తంగి పేరుతో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలని కోరారు.
పటాన్చెరు కేంద్రంగా
జోనల్ కార్యాలయం
జీహెచ్ఎంసీ కమిషనర్కు ఎమ్మెల్యే వినతి


