
చేపల కోసం వెళ్లి.. స్తంభాన్ని ఢీకొట్టి
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
కొమురవెల్లి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రం శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సార్ల రామ్చరణ్(16) అదే గ్రామంలో 10 వతరగతి చదువుతున్నాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులుతో కలిసి కొమురవెల్లి చెరువులో చేపలు పట్టడానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. చెరువులో చేపలు పడకపోవడంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కొమురవెళ్లి నుంచి తిమ్మారెడ్డిపల్లి వెళ్లే రోడ్డులో ఎదురుగా వస్తున్న బొలోరో వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న రామ్చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
కంది(సంగారెడ్డి): వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... కందికి చెందిన కోస్కే వినోద్ కుమార్ గౌడ్(22) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కందిలో దాబాకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో పటాన్ చెరు వైపు నుంచి సంగారెడ్డికి వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ కుమార్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదవశాత్తు కింద పడి కార్మికుడు..
పటాన్చెరు టౌన్: ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నేపాల్కు చెందిన మూసారహు సాదే (55) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం వచ్చి పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వాష్ రూమ్కి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కిందపడి తలకి గాయమైంది. తోటి కార్మికులకు చెప్పగా ఇస్నాపూర్లో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మంగోల్లో గుర్తు తెలియని మృతదేహం
కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం మండలంలోని మంగోల్ గ్రామంలో కనిపించింది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... గ్రామంలో 15 రోజులుగా గుర్తు తెలియని వృద్ధుడు భిక్షాటన చేస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి బస్టాప్ వద్ద పడుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు.

చేపల కోసం వెళ్లి.. స్తంభాన్ని ఢీకొట్టి

చేపల కోసం వెళ్లి.. స్తంభాన్ని ఢీకొట్టి