
డ్రగ్స్పై నిఘా పెంచాలి
సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై నిఘా పెంచాలని సీపీ అనురాధ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీసు కమిషనరేట్లో పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసుల్లో శిక్షల శాతం పెంచాలన్నారు. ఆత్మహత్యలకు గల కారణాలు గుర్తించి నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులతో కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 కాల్స్పై అలసత్వం వహించవద్దన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు రవీందర్రెడ్డి, నరసింహులు, సదానందం, రవిందర్, శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్గౌడ్, కిరణ్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, దుర్గ, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
గంజాయి పట్టివేత
రామచంద్రాపురం (పటాన్ చెరు): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీధర్ మాలిక్ జీవనోపాధి కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు వలస వచ్చాడు. ఇక్కడ లేబర్ క్యాంపులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో తన గ్రామం నుంచి గంజాయి తీసుకొచ్చి లేబర్ క్యాంపులో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి నిందితులకు జైలు
జహీరాబాద్ టౌన్: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జహీరాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం... ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా గంపవరానికి చెందిన పవన్ కుమార్ (36), అనిమేశ్ మండల్ (26) 10 కిలోల ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా 2019లో పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. జిల్లా అదనపు కోర్టులో వాదనలు జరిగిన అనంతరం జడ్జి సోమవారం నిందితులకు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 25 వేల జరిమానా విధించారు.
వృద్ధురాలిని నమ్మించి..
చైన్ స్నాచింగ్
తూప్రాన్: వృద్ధురాలి మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయిన ఘటన మున్సిపల్ పరిధిలోని పడాల్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెప్యాల లలిత (68) కొందరు మహిళలతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షలకు వచ్చింది. తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఆటో స్టాండు వద్ద నిలుచుంది. ఈ క్రమంలో ఓ యువకుడు వచ్చి ‘అమ్మ ఇక్కడ ఉన్నవా.. మీ కోసం మీ ఇంటికి వెళ్లాను. అక్కడ మీరు లేరు. మీకు పింఛన్ వచ్చింది’ అని నమ్మబలికాడు. రెండు పాస్ ఫొటోలు, ఆధార్ కార్డు కావాలని అడిగాడు. వృద్ధురాలు ఆ యువకుడి మాటలు నమ్మి ఫొటోలు లేవని తెలిపింది. ఆధార్కార్డుపై ఉన్న ఫొటోను చూసి ఇందులో నీ మెడలో నగలు లేవు.. ఫొటో తీయించుకువస్తాను నీ మెడలోని గొలుసు ఇవ్వమని అడిగాడు. దీంతో నమ్మిన వృద్ధురాలు ఆధార్కార్డుతో పాటు గొలుసు ఇచ్చింది. అవి తీసుకెళ్లిన యువకుడు ఎంతకు తిరిగిరాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్స్పై నిఘా పెంచాలి