
47 మందిపై కేసులు నమోదు
సిద్దిపేటకమాన్: పట్టణ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆదివారం నిర్వహించిన ఆకస్మిక వాహన తనిఖీల్లో 47 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని రాజీవ్ రహదారిపై, ఇతర ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది ఆదివారం సాయంత్రం 5నుంచి 7 గంటల వరకు ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 47 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో పాటు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 65 ఈ పెట్టి కేసులతో పాటు మొత్తం 375 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహన తనిఖీల్లో సీఐలు వాసుదేవారావు, ఉపేందర్, శ్రీను, సైదా, లతీఫ్, మహేందర్రెడ్డి, ప్రవీణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
నిజాయితీ చాటుకున్న
ఆర్టీసీ సిబ్బంది
బస్టాండ్లో మరిచిపోయిన బ్యాగు అప్పగింత
హుస్నాబాద్: ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో తమ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హుస్నాబాద్ బస్టాండ్లో బస్సు ఎక్కిన ఓ మహిళా ప్రయాణికురాలు బస్టాండ్లోనే బ్యాగు మరిచిపోయింది. రద్దీగా ఉండటంతో బస్సు సీటు ఆపడం కోసం బస్సు ఎక్కింది. గ్రామానికి వెళ్లాక బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించింది. సమాచారం అందిన వెంటనే బ్యాగు రికవరీ చేసిన ఆర్టీసీ సిబ్బంది తిరిగి ప్రయాణికురాలి కుటుంబ సభ్యులకు బ్యాగును సురక్షితంగా అప్పగించారు. బ్యాగులో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, 20 తులాల వెండి, రూ.15వేలు నగదు ఉన్నాయి. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికురాలు, ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రస్థాయి ఫుట్బాల్కు గజ్వేల్ క్రీడాకారులు
గజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్కు గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్కు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు జీఎఫ్ఏ(గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్) అధ్యక్షుడు గంగిశెట్టి రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ –15 బాలుర ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలో గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్కు చెందిన క్రీడాకారులు కే.సాయి, సీహెచ్.సుశాంత్. ఎం.కార్తీక్ ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 28 నుంచి జూలై 1వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులతో పాటు కోచ్ నాగేష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీఎఫ్ఏ ప్రతినిధులు నరేష్, శ్రీనివాస్, సతీష్, శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు.
కుక్కల దాడి..
లేగదూడ మృతి
రేగోడ్(మెదక్): కుక్కల దాడిలో ఓ లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మర్పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు భూంరెడ్డికి చెందిన ఆవుకు ఇటీవల ఓ లేగదూడ జన్మించింది. మూడు రోజుల ఆ దూడపై కుక్కలు పైశాచికంగా దాడిచేసి పీక్కుతిన్నాయి. గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించి తరిమేశారు. గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేశాయని గ్రామస్తులు తెలిపారు. కుక్కలను నివారించాలని గతంలో అధికారులకు వినతిపత్రం అందజేశామన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యక్తి ఆత్మహత్య
జిన్నారం (పటాన్చెరు): అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేసన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... నగర పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసముండే గొల్ల నారాయణ రావు కొంత కాలంగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కాగా పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

47 మందిపై కేసులు నమోదు

47 మందిపై కేసులు నమోదు