
ఆన్లైన్ తప్పిదం.. విద్యార్థి చదువుకు దూరం
కొండాపూర్(సంగారెడ్డి): ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు చేసిన తప్పిదం కారణంగా విద్యార్థి చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి 544 మార్కులు సాధించినప్పటికీ ఆ విద్యార్థికి ఇంటర్ విద్య అందని ద్రాక్షలాగానే మిగిలిపోయేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే .. కొండాపూర్ మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన కురాకుల అక్షిత అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివింది. ఇటీవలే విడుదలైన పది ఫలితాలలోనూ 544 మార్కులు సాధించింది. సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదవాలనుకుంది. దీంతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఓ ఇంటర్నెట్లో గురుకుల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంది. సదరు ఇంటర్నెట్ నిర్వాహకుడు దరఖాస్తు ఫారం ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న సమయంలో విద్యార్థి జెండర్ దగ్గర సీ్త్ర కి బదులు పురుషుడు అని నమోదు చేశారు. ఆ అమ్మాయికి చిలుకూరులోని సోషల్ వెల్ఫేర్ బాలుర కళాశాలలో సీటు వచ్చింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.
అక్షిత తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ప్రైవేట్ కళాశాలలో చదివించే ఆర్థిక స్తోమత లేదు. అధికారులు స్పందించి సదరు వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా సోషల్ వెల్ఫేర్ బాలికల కళాశాలలో సీటు ఇప్పించాలని కోరుతున్నారు.