
ఎట్టకేలకు డీఎస్ఆర్ అమలు
మొదట యాప్ను నిరాకరించిన పంచాయతీ కార్యదర్శులు
సంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీల్లో పాలన పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్– డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లో వివరాలు అప్డేట్ చేసేందుకు దూరంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎట్టకేలకు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గత నెల 24న ఈ విధానంను అమలులోకి తెచ్చినా ఇప్పటి వరకు వివరాలు నమోదు చేయలేదు. జిల్లాలో వివరాలు నమోదు చేస్తున్న వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఏ శాఖలో లేని విధంగా తమకు ఫేస్ రికగ్నైషన్ యాప్ ఎందుకని పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు.
కొత్త మార్గదర్శకాలతో రూపకల్పన
గత ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ యాప్ను రూపొందించింది. అందులో ఉన్న మార్గదర్శకాలతో పలువురు పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించకపోవటంతో పాటు విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం యాప్లో పలు మార్పులు చేస్తూ ఫేస్ రికగ్నైషన్తో హాజరుతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నది. ప్రతి రోజు సంబంధిత కార్యాలయానికి వెళ్లి ఫొటోతో ఫేస్ రికగ్నైషన్తో హాజరు వేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా సేకరించిన చెత్త వివరాలను తూకం వేసి, ఎన్ని కేజీలు ఉందో వివరాలు అప్లోడ్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 631
గ్రామ పంచాయతీలు
జిల్లాలోని 26 మండలాల్లో 631 గ్రామ పంచాయతీల్లో 631 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల మెరుగైన పారిశుద్ధ్యానికి జోన్లను ఆయా గ్రామాల్లో ఇండ్ల సంఖ్య, జననివాసం, మార్కెట్లు, ఇనిస్టిట్యూషన్, వ్యాపార సంస్థల ఆధారంగా జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామపంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు విభజించారు. ఈ మేరకు 1464 జోన్లను ఏర్పాటు చేశారు. యాప్ వినియోగం ద్వారా జిల్లాలో బుధవారం వరకు 15 గ్రామ పంచాయతీల్లో మాత్రమే అమలైంది. మిగితా 616 గ్రామ పంచాయతీలు అమలుకు దూరంగా ఉన్నాయి. గురువారం జిల్లా అంతటా యాప్ అమలు ప్రారంభభమైంది. మొదటి రోజు జిల్లా అంతటా ఫేస్ రికగ్నైషన్ యాప్ ద్వారా హాజరు వేశారు. మిగితా వివరాలు సైతం నమోదు చేయనున్నారు.
అంగీకరించని కార్యదర్శులు
ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ను మొదట పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకించారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్న్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోరం, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫోరం.. ఈ మూడు సంఘాలు జేఏసీగా ఏర్పడి యాప్కు వ్యతిరేకంగా పోరుబాట చేపట్టారు. ఇప్పటికే తమ ఫోన్లలో ఇందిరమ్మ ఇళ్లు, స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ, ఆహారభద్రత కార్డులతో పాటు తదితర వివరాలను యాప్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా వచ్చిన యాప్తో మరింత భారం అవుతుందని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు.
గత నెల 24నుంచి అందుబాటులోకి
ఫేస్ రికగ్నైషన్తో కార్యదర్శుల హాజరు
పారదర్శక పాలన అమలుకు చర్యలు