
ప్రాణం నిలిపే దాతలు
ఆపదలో ఆదుకుంటున్న రక్తదాతలు
ఇప్పటివరకు 500 మందికి రక్తదానం
సంగారెడ్డి బ్లడ్ డోనార్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 500 మందికి రక్తదానం చేశాం. 2019లో ఈ గ్రూప్ ప్రారంభించాం. ఈ గ్రూపులో 300 మంది వరకు సభ్యులున్నారు. రక్తం అవసరం ఉందని గ్రూపులో మెస్సేజ్ వస్తే స్పందించి రక్తదానం చేయడానికి మా గ్రూప్ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. –బంగారు క్రిష్ణ, సంగారెడ్డి
22 సార్లు ఇచ్చాను
నాది ఏబీ–పాజిటివ్ గ్రూప్. ఇప్పటివరకు 22 సార్లు రక్తదానం చేశాను. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అనేక శిబిరాల్లోనే కాకుండా నేరుగా ఆస్పత్రులకు వెళ్లి రక్తదానం చేశాను.
–సయ్యాద్ సజీద్ సుహన్,
ప్రభుత్వ ఉద్యోగి
అపోహలు వీడాలి..
రక్తదానం చాలా విలువైనది. ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదాతలమవుదాం. ఆరోగ్యవంతమైన ప్రతీ ఒక్కరూ వైద్యుల సలహాలు, సూచనలతో ఏడాదిలో 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు.
–డాక్టర్ సతీశ్ ,జనరల్ ఫిజీషియన్, సంగారెడ్డి
సంగారెడ్డి క్రైమ్: రక్తదానం చేయడమంటే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని వైద్యులు చెబుతుంటారు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం అవసరమైన సందర్భాల్లో రోగి కుటుంబసభ్యులు రక్తం కోసం పడే పాట్లు వర్ణనాతీతం. చేతిలో డబ్బులుండి వైద్యం చేయించే అవకాశం ఉన్నా కూడా ఆ సమయంలో రోగికి రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకురాకపోతే ఇక ఆ రోగి పరిస్థితి చెప్పనవసరం లేదు. అప్పటివరకూ రక్తదానం గురించి ఎవరూ కనీసం అవగాహన లేని ఆలోచించని స్థితిలో ఉన్నవారు సైతం అప్పటికప్పుడు బ్లడ్ బ్యాంకుల వెంట లేదా తెలిసిన బంధువులు, స్నేహితుల్ని రక్తదానం చేయమని వేడుకుంటూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విషయం తెలుసుకుని ఇదిగో మేమున్నామంటూ ముందుకొస్తోంది సంగారెడ్డి పట్టణ యువత. ఈ యువతకు ఎవరూ ఎవరికీ తెలియనవసరం లేదు. రక్తసంబంధమే ఉండనక్కర్లేదు. రక్తం కావాలని సమాచారం తెలిస్తే చాలు రక్తమిచ్చి వెళ్తారు.
అపోహలు వీడి...
ఒకప్పుడు రక్తదానంపై అనుకున్నంత స్థాయిలో అవగాహన పెరగలేదు. కొంతమంది యువత ఏవో లేనిపోని అపోహలతో రక్తదానానికి దూరంగా ఉండేవారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లోగానీ, రక్తనిధి కేంద్రాల్లో దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే మారుతున్న కాలంలో వాట్సప్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెరిగి యువత అపోహలు వీడి రక్తదానానికి ముందుకు వస్తోంది. ఎవరికై నా రక్తం అవసరమైన విషయాన్ని సోషల్మీడియాలోగానీ, వాట్సాప్లోగానీ తెలుసుకుంటున్న యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ఇప్పుడొక శుభపరిణామం.
రక్తదాతల దినోత్సవం..
జూన్ 14వ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతీ నెల ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తూ బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇటీవలే పట్టణంలో రక్తదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో రక్తదాతల సంఖ్య కూడా పెరుగుతోంది.
వీరు చేయవచ్చు..
రక్తదాత వయస్సు 18 నుంచి 60లోపు ఉండాలి. తమ శరీర బరువు కనీసం 45 కిలోలు పైబడి ఉండాలి. రక్తదాత నుంచి సేకరించే రక్తం (300 ఎంఎల్) ఒక యూనిట్ మాత్రమే. యువతీ,యువకుల్లో టాటు వేయించుకున్నవారు రక్తదానం చేయడం ప్రమాదకరం. రక్తదాతలు రక్తం ఇచ్చిన 24 గంటల వరకు ధూమపానంగానీ, మద్యం తాగడం గానీ చేయకూడదు.
ప్రముఖ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు కారల్ల్యాండ్ స్టీనర్ 19వ శతాబ్దంలో మానవ రక్తకణాలు కనుగొన్నందుకు గాను 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని
జరుపుతున్నారు.
రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పట్టణ యువత
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ప్రాణం నిలిపే దాతలు

ప్రాణం నిలిపే దాతలు

ప్రాణం నిలిపే దాతలు