
గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
కల్హేర్(నారాయణఖేడ్)/కంగ్టి(నారాయణఖేడ్)/నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్లతో గూడు లేని పేదలకు సొంతింటి కల నేరవేరుస్తామని ఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట్ మండలం రాంరెడ్డిపేట్లో, కంగ్టి మండల కేంద్రంలోని తడ్కల్, ఎడ్లరేగడి తండాలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కంగ్టి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. మండలానికి 464 మందికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ఇళ్లు నిర్మాణానికి రూ.5 లక్షలు నాలుగు విడతల్లో చెల్లింపు చేయనున్నట్లు తెలిపారు. 45 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. పేద చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కొన్ని సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను మొదలుపెట్టామని దశలవారీగా అన్ని స్కూళ్లలోనూ వీటిని ప్రారంభిస్తామని తెలిపారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి