
మతలబేమిటో!
మార్పు వెనుక
కొండా సురేఖను తప్పించి వివేక్ నియామకం ఆ నియోజకవర్గాల్లో కేడర్ సమన్వయం వివేక్కు సవాలే
చర్చనీయాంశంగా మారిన ఇన్చార్జి మంత్రి మార్పు నిర్ణయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి మార్పుపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామిని ఇన్చార్జి మంత్రిగా నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో ఇన్చార్జి మంత్రిది కీలక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో 4 చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన 7 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న జిల్లాలో ఇన్చార్జి మంత్రి పాత్ర మరింత కీలకం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను, కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో కీలకమైన ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖను మార్చడం వెనుక కారణమేమై ఉంటుందోననే దానిపై చర్చ జరుగుతోంది.
కలకలం రేపిన వేర్వేరు సమీక్షలు..
జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖలు ఒకే అంశాలపై ఒక్క రోజు వ్యవధిలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ పనుల సమాయత్తం వంటి అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాల మేరకు పక్షం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సంగారెడ్డిలో జరిగింది. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరైనప్పటికీ.. కేవలం కొండా సురేఖ మాత్రమే సమీక్షలో మాట్లాడారని తెలిసింది. ఈ సమీక్ష జరిగిన 24 గంటలు గడవకముందే దామోదర రాజనర్సింహ ఇవే అంశాలపై జిల్లా పరిషత్లో మరోసారి సమీక్షలు నిర్వహించారు. ఇలా కొండా సురేఖ సమీక్షించిన అంశాలనే ఒక్క రోజు కూడా గడవక ముందే దామోదర సమీక్షించడం అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇలా జిల్లా మంత్రితో పొసగక పోవడంతోనే ఇన్చార్జి మంత్రి మారారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకోవాలంటే పకడ్బందీగా కార్యాచరణ అవసరం ఉంటుంది. ఇన్చార్జిగా బాధ్యతల్లో ఉంటే ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కుదరకపోవచ్చనే కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఆ నియోజకవర్గాల్లో కీలకం..
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన వివేక్వెంకటస్వామికి ఒకవిధంగా ఈ బాధ్యతలు సవాలుగానే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నా జిల్లాలో పార్టీ కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కేడర్ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఇన్చార్జి మంత్రి మార్పు అనేది సంబంధిత వర్గాల్లో చర్చకు దారితీసింది.

మతలబేమిటో!