అర్ధరాత్రి సంకెళ్లు ఏమిటీ..?
ఎంపీ రఘునందన్రావు
సంగారెడ్డి జోన్: పాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పులే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్నారన్నారని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. గతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరిట అర్ధరాత్రి సమయంలో రైతులకు సంకెళ్లు వేసి అరెస్టులు చేశారో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే వైఖరి అవలంబిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి మారిండు, ప్రభుత్వం మారింది.. కానీ ప్రజాపాలన వస్తుందని ఆశించిన ప్రజలకు చివరకు మళ్లీ అదే అర్ధరాత్రి రైతుల సంకెళ్లు తప్ప ఏమి మిగలలేదన్నారు. ప్రభుత్వాలు మారినా రైతుల బతుకుల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం మిర్చి యార్డులో రైతులకు సంకెళ్లు వేసినప్పుడు.. మల్లన్న సాగర్లో అర్ధరాత్రి ఊర్లను ఖాళీ చేస్తుంటే నిరాహార దీక్ష చేసిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత లగిచర్ల సంఘటన అనంతరం రాత్రిపూట అరెస్టులు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పని చేయాలన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసి ప్రజల అవస్థలు పడుతుంటే వడ్ల కొనుగోలు జరగకుండా, లారీలు రాకుండా ఇబ్బందులు పడుతుంటే ఒకరు ముంబై.. మరొకరు ఢిల్లీకి వెళ్లి ఆరోపణలు చేస్తున్న ఇద్దరూ చర్లపల్లి జైలులో ఉండాల్సిన వారేనని ఎద్దేవా చేశారు. ఫార్మాసిటీ కట్టాలనే ఆలోచన ఉంటే గత ప్రభుత్వం ఫార్మా పేరిట సేకరించి, అభివృద్ధి చేసిన భూమి ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.


