ప్రతి మండలంలో అధ్యయన కేంద్రాలు
సద్వినియోగం చేసుకోవాలి
● చదువు మధ్యలో ఆపేసిన వారికి వరం
● ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు
● వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు
కేశంపేట: అనివార్య కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన యువతీయువకులకు ఓపెన్ స్కూల్ వరంగా మారింది. ఓపెన్లో విద్యలో చదువు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరినవారిలో ఎందరో ఉన్నారు. చదువుకోవాలనే ఆశ ఉన్నా పాఠశాలలకు వెళ్లలేని వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అందిస్తోంది. పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో ఓపెన్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, కొన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలన్నా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. దీంతో చాలామంది ఓపెన్ విద్య వైపు ఆసక్తి కనబురుస్తున్నారు. ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా అపరాధ రుసుంతో ఆగస్టు 29 వరకు అడ్మిషన్లు స్వీకరించనుంది.
జిల్లావ్యాప్తంగా 68 కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 68 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పహాడీషరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, హఫీజ్పేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ మీడియంలో అడ్మిషన్లు పొంది చదువుకునేందుకు సైతం అవకాశం ఉంది.
వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో..
వికారాబాద్ జిల్లాలో 25 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు, మేడ్చల్ జిల్లాలో 34 సెంటర్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తూ తోడ్పాటు అందిస్తోంది.
అడ్మిషన్లు ఇలా..
● చదువు మధ్యలో ఆపేసినవారు, గృహిణులు, వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు ఓపెన్ విద్యలో అడ్మిషన్లు పొందొచ్చు.
● ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో
సమర్పించాలి.
● అడ్మిషన్లు పొందిన వారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.
● మరింత సమాచారం కోసం www.telanganaopenschool.org వెబ్సైట్లో
సంప్రదించాలి.
పదో తరగతి ప్రవేశాలకు..
● ఆగస్టు 31 నాటికి 14 ఏళ్ల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి.
● గతంలో రెగ్యులర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు ఓపెన్లో రెండు సజ్జెక్టుల మార్కులను బదలాయించుకోవచ్చు.
● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు రూ.1,150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,250 చెల్లించాలి.
● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యా పుస్తకాలు అందిస్తుంది.
● అడ్మిషన్ తీసుకున్న ఐదేళ్ల వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు..
● పదో తరగతి పాసై, ఒక్క ఏడాది గ్యాప్ ఉంటేనే అర్హులు.
● ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి.
● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలకు రూ.1,500 స్కూల్ ఫీజు ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,850 చెల్లించాలి.
● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యాపుస్తకాలు అందిస్తుంది.
అవసరమైన పత్రాలు
● ఇటీవల తీసిన పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు
● ఇంటర్మీడియెట్ చదివేవారికి ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్
● పుట్టిన తేదీ సర్టిఫికెట్ .
ఆగస్టు వరకు అవకాశం
పదో తరగతి, ఇంటర్మీడియెట్లో ఆగస్టు 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ పొందొచ్చు.
ప్రభుత్వం నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలో చదివే విద్యార్థుల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వివరాలు, మహిళా సంఘాల నుంచి నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి వరకు చదవలేని వారు, చదువు మధ్యలో ఆపిన వారు, చదవడం, రాయడం వచ్చిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించేందుకు ప్రతి మండలంలో అధికారులు అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి మండల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశాం. చదువు మధ్యలో ఆపివేసిన వారు, చదువుపై ఇష్టం ఉన్నవారు కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి.
– సత్యనారాయణ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కోఆర్డినేటర్


