చేవెళ్ల: లేబర్ అడ్డాల వద్ద ఉండే కార్మికులకోసం మౌలిక వసతులు కల్పించాలని ఏఐటీయుసీ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి అన్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికుల నాలుగో మహాసభలను మండల అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో రూ.కోట్ల నిధులు ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. కార్మికుంతా లేబర్ కార్డులు తీసుకొని సంక్షేమ ఫలాలు పొందాలన్నారు. లేబర్ అడ్డాల వద్ద మొబైల్ టాయిలెట్లు, రూ.ఐదుకు భోజనం వసతులు కల్పించాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్మిక వర్గంపై దాడులు పెరిగాయని ఆరోపించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని అన్నారు. వికసిత్ భారత్ అంటే ధరల మీద ధరలు పెంచడమేనా అని ప్రశ్నించారు. కార్మికులంతా సంఘటితంగా హక్కులకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు మక్బుల్, శ్రీను, ఆంజనేయులు, నర్సింలు, యాదయ్య, లక్ష్మి, లీన, లలితమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.


