న్యూస్రీల్
తక్కువ వస్తున్నాయి
డిమాండ్కు తగ్గ సరఫరా
ఎప్పటికప్పుడు చర్యలు
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026
మున్సిపాలిటీలు తాగునీటికి గోస పడుతున్నాయి.. వేసవిలో సమస్య మరింత తీవ్రంగా మారింది.. మిషన్ భగరీథ ద్వారా సరఫరా చేసే నీళ్లు అన్ని వార్డులకు సరిపోవడం లేదు.. బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.. కొత్త పైప్లైన్లు, మరమ్మతులు, లీకేజీల పేరుతో వచ్చే నీటికి కోత పెడుతున్నారు. కొన్ని పట్టణాల్లో ఇళ్ల యజమానులే స్వయంగా ట్యాంకర్లు తెప్పించుకుంటుండగా, మరికొన్ని చోట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కుటుంబాలు, జనాభా సంఖ్య నానాటికీ పెరుగుతున్నా ఆ మేరకు పంపిణీ కావడం లేదు. దీంతో తాగునీటికి తంటాలు తప్పడం లేదు.
మున్సిపాలిటీల్లో తాగునీటి గోస
● పైప్లైన్ పనులు, మరమ్మతులు, లీకేజీల పేరిట కోత
● రోజు విడిచి రోజు
అరకొరగా సరఫరా
● ట్యాంకర్లను
ఆశ్రయించాల్సిన పరిస్థితి
● ఇబ్బందుల్లో ‘పుర’ ప్రజలు
ఇబ్రహీంపట్నం: మహిళలను ఆర్థికంగా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడాన్ని హర్షిస్తూ నియోజకవర్గంలోని ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, పొదుపు సంఘాల మహిళలు తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రుణపరిమితిని రెట్టింపు చేయడంతో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో తోడ్పడుతుందన్నారు. గ్రామీణ మహిళల కళ్లలో వెలుగు చూసేందుకు డ్వాక్రా వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం అంకెలగారెడీ కాదని.. అతివల ఆత్మగౌరవం, ఆర్థిక స్వేచ్ఛకు అసలైన హామీగా అభివర్ణించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని .. రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కావాలని సూచించారు.
అబ్దుల్లాపూర్మెట్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు మండలంలోని బాటసింగారం జెడ్పీహెచ్ఎస్ తొమ్మిదో తరగతి విద్యార్థి మండారి ధనాంజనేయులు ఎంపికయ్యాడు. ఈ నెల 7న సరూర్నగర్ ఇండోర్ ప్రధాన అథ్లెటిక్స్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి 16 ఏళ్ల లోపు బాలుర విభాగంలో జావెలిన్ త్రో ఈవెంట్కు అర్హత సాధించాడు. ఆదివారం హనుమకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే పోటీలో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఉపాధ్యా యులు, సర్పంచ్ గౌరిశంకర్చారి, ఉప సర్పంచ్ వెంకటేశ్యాదవ్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంఈఓ జగదీశ్ తదితరులు విద్యార్థిని అభినందించారు.
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి వరంగల్, హన్మకొండ, జనగామ, తొర్రూరు, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల వైపు వెళ్లే జిల్లా బస్సుల స్టాప్ను వీటీ కమాన్ దగ్గరున్న ఉప్పల్ బస్టాండ్కు తరలించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఉప్పల్ బస్టాండ్ వద్దే జిల్లా బస్సుల రాకపోకలకు తగిన సదుపాయాలు కల్పించడం ద్వారా ఉప్పల్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందనే అభిప్రాయంతో ఇందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తదితర పనుల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) అధికారులు టెండర్లు పిలిచారు. సర్వేతోపాటు ఉప్పల్ బస్టాండ్ వద్ద డిజైన్లు, డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డీటైల్స్, ఎస్టిమేట్స్ తదితర పనులు కూడా చేయాల్సి ఉంది.
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో 2, 3, 4, 10వ వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో నీటి సరఫరా అగమ్యగోచరంగా మారింది. పంచాయతీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పథకం కింద గ్రామం మొత్తంలో పైప్లైన్లు వేసి, ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశారు. ఆ నల్లాల్లో మిషన్ భగీరథ నీళ్లు మాత్రం ఇప్పటి వరకు రావడంలేదు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు తక్కువగా రావడంతో సంపులో నింపుతున్నారు. గతం నుంచి ఉన్న బోరుబావుల నీటిని సైతం నింపి.. రెండూ కలిపి పాత పైప్లైన్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. దీంతో మిషన్ భగీరథ నల్లాలు వృథాగా మారాయి.
ఎండలు పెరగడంతో..
ఇటీవల ఎండల తీవ్రత పెరగడంతో నాలుగు వార్డుల్లో నీటి సరఫరా తగ్గింది. రెండు రోజులకోసారి గంటపాటు వదులుతున్నారు. ఆ సమయంలో కొందరు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తుండడంతో చాలా ఇళ్లకు సరిగా రావడంలేదు. కొంత మంది ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. మరోవైపు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేసే నీటిని ఇంటి అవసరాలకే వినియోగించుకుంటున్నారు. తాగడానికి మాత్రం ఫిల్టర్, మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తున్నారు.
ఆమనగల్లు: మున్సిపాలిటీలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో సకాలంలో నీరు సరఫరా కావడం లేదు. పైప్లైన్ నిర్మాణ పనులు చేపడుతుండడంతో ఆ సమయంలో కొన్ని కాలనీలకు నీటి సరఫరా జరగడం లేదు. దీంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాటర్ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. నిత్యం 30 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా మిషన్ భగీరథ పథకం ద్వారా 20 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో ఇంటింటికీ రోజువిడిచి రోజు పంపిణీ జరుగుతోంది. మున్సిపల్ పరిధిలోని బోర్ల ద్వారా ఏడు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. 3 లక్షల లీటర్ల నీరు తక్కువగా సరఫరా అవుతుండటంతో ప్రతిరోజు కొన్ని కాలనీలకు ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ, నుగులబండ, పద్మశాలీ కాలనీ, గుర్రంగుట్ట కాలనీ, ఉదయనగర్ కాలనీలో నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టణంలో వాటర్ట్యాంక్లు, నూతన పైప్లైన్ల నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం ద్వారా అమృత్ 2.0 పథకం కింద రూ.30 కోట్లు మంజూరు కాగా కొన్ని నెలల క్రితం పనులు ప్రారంభించారు. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట పైప్లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల ఆదర్శనగర్ కాలనీలో పనులు జరగడంతో 15 రోజులు పాటు సరఫరా నిలిచిపోయింది.
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలోని హౌసింగ్బోర్డు, మల్కాపూర్, దామరగిద్ద, ఊరేళ్ల, రామన్నగూడ తదితర వార్డుల్లో నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. మల్కాపూర్ 12వ వార్డులో మిషన్భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు. హౌసింగ్ బోర్డు కాలనీలో సైతం ఇదే పరిస్థితి. మరమ్మతులు, లీకేజీలు అంటూ సక్రమంగా సరఫరా కాని మిషన్భగీరథ నీటితో జనం ఇబ్బంది పడుతున్నారు. రోజువిడిచి రోజు సరఫరా అవుతున్న నీళ్లు సరిపోవడం లేదు. అధికారులను ఎప్పుడు అడిగినా పైపులైన్ మరమ్మతులు ఉన్నాయని చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
ఇబ్రహీంపట్నం: అవసరానికి తగ్గట్టు మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది. వేసవిలో నీటి వినియోగం పెరుగుతోంది. దానికి తగ్గట్టు పంపిణీ జరగాల్సిందిపోయి నిత్యం వచ్చే నీటినే తగ్గించడంతో జనం అవస్థలు పడుతున్నారు. మున్సిపాలిటీకి మిషన్ భగీరథ ద్వారా నిత్యం 42 లక్షల లీటర్ల పంపిణీ జరిగేది. ఇటీవల 35 లక్షల లీటర్లకు తగ్గించారు. పెరిగిన కుటుంబాలు, జనాభా మేరకు 50 లక్షల లీటర్లు అవసరమవుతాయి. గతంలో రోజు విడిచి రోజు 40 నిమిషాల పాటు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం 25 నుంచి 30 నిమిషాలు మాత్రమే నీటిని వదలుతున్నారు. ఆయా బస్తీల్లో 95 బోర్లు పనిచేస్తున్నాయి. వాటిపైనే ఆధారపడి సర్దుబాటు చేసుకుంటున్నారు.
అనంతగిరి: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తున్నట్లు తెలిపారు. రైల్వే, రోడ్లు, పలు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టి అజేయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. నేడు అన్ని వర్గాల ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కన్వీ నర్ కరణం ప్రహ్లాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి, శివరాజు, రమేష్కుమార్, మిట్ట పరమేశ్వర్, పాండుగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, అసెంబ్లీ కోర్డినేటర్ వడ్ల నందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లేశం, నరోత్తంరెడ్డి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: జనగణన– 2027కు సంబంధించి స్వీయ గణనకు ఆదివారం చివరి రోజు. నగర పౌరులు ఇంటి, కుటుంబ వివరాల్ని ఆన్లైన్లో స్వీయ గణన చేసి జనగణన సజావుగా, వేగంగా జరిగేందుకు సహకరించాలని ప్రధాన జనగణన అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి.సృజన, ఎంఎంసీ కమిషనర్ టి.వినయకృష్ణారెడ్డి సూచించారు. స్వీయ గణన చేశాక సంబంధిత ఐడీని గణన అధికారి మీ ఇంటికి వచ్చినప్పుడు చూపించాలని పేర్కొన్నారు.
se.census.gov.in ద్వారా మొబైల్/ల్యాప్టాప్/కంప్యూటర్ నుంచి స్వీయగణన చేసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ గ్రూపులకు ఈ విషయాన్ని చేరవేసి, ఎక్కువమంది స్వీయగణన చేసేలా సహకరించాలన్నారు. స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.
రావాల్సిన మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. 35 లక్షల లీటర్లు మాత్రమే నిత్యం పంపిణీ జరుగుతోంది. ఆయా బస్తీల్లో బోర్లు పనిచేస్తుండంతో కొంతమేర వెసులుబాటు అవుతోంది. నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – బాబురావు, మంచినీటి విభాగం అధికారి
కొత్తూరు: మున్సిపాలిటీలో 12 వార్డులు, సుమారు 23 వేల జనాభా, 8 వేల కుటుంబాలు, 3 వేల ఇళ్లు ఉన్నాయి. 25 ఓవర్హెడ్ ట్యాంకులు, బోర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం 1.80 ఎంఎల్డీ నీటి డిమాండ్ ఉండగా 1.50 మిషన్ భగీరథ, మిగిలినవి స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు.
అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతోంది. ఇబ్బందులు తలెత్తితే స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– బాలాజీ, మున్సిపల్ కమిషనర్, కొత్తూరు.


