దుద్యాల్: వేసవి రాగానే హస్నాబాద్ వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో నిత్యం అంబలి పంపిణీ చేస్తున్న దాతలు ఆదర్శంగా నిలుస్తున్నారు. 36 ఏళ్లకు పైగా ఈక్రతువును కొనసాగిస్తూ ఔరా అనిపిస్తున్నారు. దాతలు, రైతులు అందించే జొన్నలు, రాగులతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంబలి తయారు చేస్తారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులకు పంచుతున్నారు. ప్రతిరోజూ సుమారు 50 కిలోల పాత్ర నిండా జొన్నలు, రాగుల అంబలి వండి, అందులో శనగలు కలిపి జనాలకు అందిస్తున్నారు.
శ్రీరామ నవమితో ప్రారంభం..
పూర్వం గ్రామంలోని వీరభద్రేశ్వరస్వామి ఆలయానికి శ్రీగురు గోవిందానంద సరస్వతి స్వామివారు వచ్చి భక్తులకు ప్రవచనాలు చెప్పేవారు. పూజలు ముగిసిన అనంతరం ఆలయంలో అంబలి పంపిణీ చేయాలని స్వామివారు సూచించడంతో అప్పటి నుంచి ఈరోజు వరకూ వేసవిలో ఈకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఏటా శ్రీరామ నవమి రోజున ప్రారంభించి, ఎండల తీవ్రత తగ్గేవరకూ అంబలి పంపిణీ కొనసాగుతుంది. తమకు తోచిన సాయం చేస్తూ భక్తులు సైతం దీనికి సహకరిస్తున్నారు. దాతలు, రైతులు అందించే జొన్నలను గ్రామానికి చెందిన మజ్జిబాబా తన గిర్నీలో ఉచితంగా పిండి పట్టించి, సాయం చేస్తున్నారు. అంబలి తాగడం ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.
హస్నాబాద్లో 36 ఏళ్లుగా పంపిణీ
దాతల సహకారంతో ఏటా కొనసాగుతున్న కేంద్రం
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు


