మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపులేక బీఆర్ఎస్వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గొల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంద రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అనుచరులు ఆదివారం కాంగ్రెస్ పార్టీని వీడి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో రాక్షస, రాబంధుల పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పోవాలి .. కేసీఆర్ రావాలి అనే నినాదాంతో ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టినా ఇంకా బుద్ధి రావడం లేదన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మంద దర్శన్, మంద శ్రీరాములు, నందుపల్లి బాల్రాజ్, మంద రాఘవేందర్, గొల్కొండ రాములు, బాతుకు నరేందర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, దేవుల నాయక్, హబిబుల్లాగూడ సర్పంచ్ జగదీష్, బీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నందుపల్లి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్గని ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


