● ఈ నెలాఖరులో రెండో విడత మంజూరు
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఆమనగల్లు: రాష్ట్రంలో ఈనెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లిలో గురువారం ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సమీకృత భూ భారతి పోర్టల్ను ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి అదనంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వెల్దండ మండలంలోని చెదురుపల్లి, కుప్పగండ్ల గ్రామాల్లో రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. ఆమనగల్లులో ప్రభుత్వ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఇందిరమ్మ ఇళ్లు ఈనెలాఖరులో మంజూరు చేస్తామని తరువాత మూడో విడత, నాలుగో విడత మంజూరు చేసి అర్హులైన వారందరికీ అందిస్తామని మంత్రి చెప్పారు. ఆమనగల్లులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, కార్యాలయాన్ని తానే వచ్చి ప్రారంభిస్తానని అన్నారు. నివాస గృహాల మధ్య ఉన్న డంపిగ్యార్డును మరోచోటకు తరలించడానికి స్థలాన్ని ఎంపిక చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వెల్దండ మండలం చెదురుపల్లి, కుప్పగండ్ల రైతుల సమస్యలకు సంబంధించిన ఫైల్ తనవద్దే ఉందని, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సంబందిత మంత్రితో మాట్లాడతానని చెప్పారు. మాడ్గులలో రెవెన్యూ కార్యాలయ భవనానికి నిధులు మంజూరు చేయాలని మార్కెట్ మాజీ చైర్మన్ బట్టు కిషన్రెడ్డి, ఆమనగల్లులో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని జర్నలిస్టు సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో సీసీఎల్ఏ లోకేశ్కుమార్, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ చైర్మన్ యాట గీత, కౌన్సిలర్ అనిత, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


