మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. చిలుకూరు వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఆసీనులై ఆలయం చుట్టూ ఊరేగారు. శ్రీదేవి, భూదేవిలను వివాహం చేసుకున్న స్వామివారు వారిని గ్రామస్తులకు చూపేందుకు రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులకు వివరించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారు, అమ్మవార్లకు అద్దాల మహల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొదటి అంతస్థులో ఆసీనులను చేశారు. రథం ముందు అర్చకులు హోమం నిర్వహించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణ నడుమ రథం ముందుకు కదిలింది. రథోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్కన్నయ్య, కిట్టు, మురళీ, సురేశ్, నాగరాజు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
ఆలయ పురవీధుల్లో ఊరేగిన శ్రీదేవి, భూదేవి సమేత బాలాజీ


