● జిల్లాలో తొలి స్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన చేవెళ్ల మున్సిపాలిటీ
● మార్చి 31 నాటికి 92. 20శాతం వసూళ్లు
చేవెళ్ల: పన్నుల వసూళ్లలో చేవెళ్ల మున్సిపాలిటీ జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. పన్నుళ్ల వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టగా 92.20శాతంతో జిల్లాలో ముందు వరసలో నిలిచింది. 2025 జనవరిలో చేవెళ్ల మున్సిపాలిటీ ఏర్పడింది. పంచాయతీ లెక్కల ప్రకారం అసెస్మెంట్ సంఖ్య 5,892 కాగా రూ.1.07 కోట్లు పన్ను రాబడి ఉండేది. మున్సిపల్ అసెస్మెంట్ ప్రకారం 2025–26 నాటికి రెసిడెన్షియల్, ఎన్ఓఎస్ రెసిడెన్షియల్ కలుపుకొని అసెస్మెంట్లు 6,050గా తేలింది. వీటి ప్రకారం ఆస్తి పన్ను రూ.229 లక్షలుగా ఉండింది. గత ఆర్థిక సంవత్సరం 2024–25 ఏరియర్స్ డిమాండ్ కలుపుకొని 2025–26 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ రూ.307 లక్షలుగా మారింది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది సవాల్గా స్వీకరించి వందశాతం సాధించే లక్ష్యంతో వార్డుల వారీగా ఇంటింటికీ తిరిగి పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇంటి పన్నులు సకాలంలో చెల్లించారు. దీంతో మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 92.20శాతం వసూళ్లు సాధించింది.
ప్రజలు, సిబ్బంది సహకారంతో 92.20శాతం పన్నుల వసూలుతో జిల్లాలో తొలి స్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. గత అనుభవంతో చేవెళ్ల మున్సిపాలిటీ అభివృద్ధికి, నిధుల పెరుగుదలకు అసెస్మెంట్ల డిమాండ్ పెరగాలనే ఆలోచనతో పన్నుల వసూళ్లతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల రాబడికి కృషి చేశా. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వచ్చాయి. పురపాలకంలో పన్నుల చెల్లింపులే సగం అభివృద్ధికి ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. – వెంకటేశం, మున్సిపల్ కమిషనర్, చేవెళ్ల


