కార్పొరేషన్ ఈడీ పద్మావతి
ఇబ్రహీంపట్నం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్యచరణ ప్రణాళిక 2025–26 గాను రవాణా రంగం కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు రైతులకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ పద్మావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు ఎస్సీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ పథకంలో వ్యవసాయ డ్రోన్, వ్యవసాయ యంత్రములు, పశుపోషణ పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, కిసాన్ నర్సరీ, అయిల్పామ్ సాగు, బోర్ బావితో సబ్ మెర్సిబుల్ పంపు సెట్, సర్వీస్ కనెక్షన్ కోసం రూ.70 వేల–రూ.5 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రము, లైసెన్స్ ఉండాలి. ఎలక్రిక్ట్ ద్విచక్ర వాహనాలను గిగ్ కార్మికులకు ప్రాధాన్యత, దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, భూమి ధ్రువీకరణ పత్రాలను ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
షాద్నగర్రూరల్: ఫీ ఫర్ స్టెమ్ తెలంగాణ, స్టెల్లార్ స్కాలర్షిప్ అవార్డులను షాద్నగర్ ప్రభుత్వ గురుకుల డిగ్రీ, పీజీ మహిళా కళాశాల నుంచి ఇద్దరు అందుకున్నారు. హైదరాబాద్లోని విజ్ఞాన్ కళాశాల, ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో బుధవారం నిర్వహించిన కల్పన ఫీ ఫర్ స్టెమ్ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వారికి అవార్డులు అందజేశారు. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు, ల్యాప్టాప్ అందజేశారు. అవార్డులు అందుకున్న పూజ, మానసను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే, కోఆర్డినేటర్ అఫ్రోజ్ జహాన్, పరమేశ్వరి తదితరులు అభినందించారు.
శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ రైతులకు అదనంగా స్ప్రింక్లర్లు మంజూరు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని వెల్దండ, కడ్తాల మండలాలకు గోదాములు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అవసరమైన టార్పాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే తమ నియోజకవర్గానికి 1,500 స్ప్రింక్లర్లు మంజూరు చేసిందని, అదనంగా మరో 2,000 యూనిట్లు మంజూరు చేయాలని కోరారు.
28 మంది బృందంలో ఎస్జీటీ బాలాజీ
చేవెళ్ల: ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధి పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి విద్యావిధానాలపై అవగాహన కల్పించేందుకు 28 మంది ఉపాధ్యాయుల బృందాన్ని ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ విడుదల చేశారు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఉన్న ఈ బృందంలో దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ కొయిలకొండ బాలాజీ ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యూకేషనల్ ఎక్చేంజి ప్రోగ్రాంలో భాగంగా తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలుచేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో విద్యావిధానాలను పరిశీలించి, ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఎంపిక చేసిన విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


