మొయినాబాద్: పచ్చని తోరణాలు.. పూల పందిరి.. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరు బాలా జీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్థరాత్రి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సోనియా దర్శన్, వైస్చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు శ్రీలత రాంచందర్, జగపతి, శిరీష కిరణ్, అనసూయ నర్సింహ దంపతులు స్వామివారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి దేవాలయం సమీపంలోని మండపంలో వేంచేయించారు. అనంతరం అమ్మవార్లను సైతం ఊరేగింపుగా స్వామివారి చెంతకు తీసుకెళ్లి ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆలయ గర్భగుడి వెనకభాగంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఆసీనులను చేశారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముందుగా విశ్వక్సేనుని ఆరాధించి శుద్ధివచనం, పుణ్యహవచనాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అమ్మవార్లను జగవాహనంపై గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరవాస్తు రామాచారి, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


