కొత్తూరు: కారును టిప్పర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ శివారులో ఉన్న ఐఓసీఎల్ పెట్రోల్బంకు ఎదురుగా జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన షేక్ తల్హా అహ్మద్(23) తన కారులో ఇదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులు షేక్ అమాన్ బాషా, రజాక్, సమీర్, అసీల్తో కలిసి హైదరాబాద్కు బయలుదేరాడు. తిమ్మాపూర్ శివారులోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకు వద్దకు రాగానే రోడ్డు విస్తరణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే సమయంలో ముందు వెళ్తున్న ఓ లారీ బంకులోకి మళ్లడంతో అహ్మద్ కారును ఆపాడు. ఇదే రూట్లో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టడంతో కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పాటు అందులో ఉన్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్ వైపుకు వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఐదుగురికి స్వల్ప గాయాలు


