రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీజీ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ రెవెన్యూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘు, కార్యవర్గ సభ్యులు శనివారం ఆయనను కలిశారు. 2025–2026 వార్షిక సంవత్సరానికి జీవో విడుదల చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ హక్కుల పరిరక్షణ, రెగ్యూలర్గా బడ్జెట్ విడుదల వంటి అంశాలను దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ ఉద్యోగులకు ఎల్లప్పుడు అందుబాబులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు సహాయ ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్తో కూడిన వీల్చైర్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించనున్నట్టు తెలిపారు. అర్హులైనవారు ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఓబీఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


