కాంగ్రెస్లో టికెట్ల టెన్షన్
● నాలుగు వార్డుల విషయంలో
కుదరని ఏకాభిప్రాయం
● ఎటూ తేలని పంచాయితీ
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేయడంలో అధికార పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. నామినేషన్ల ఘట్టం చివరి దశకు చేరినా బీఫాంలు ఎవరికిస్తారనేది ఇంతవరకూ కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారు చాలా మంది నామినేషన్లు వేస్తున్నారు. కానీ బీఫాం ఎవరికి దక్కుతుందోననే ఆందోళన కొనసాగుతోంది. టికెట్ల విషయమై మాజీ ఎంపీ రంజిత్రెడ్డి తన ఫాంహౌస్లో గురువారం రోజంతా చర్చలు జరిగినట్లు తెలిసింది. మొయినాబాద్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జ్ భీంభరత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి తదితరులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. నాలుగు వార్డుల విషయంలో ఎమ్మెల్యే వర్గం, భీంభరత్ వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో ఎటూ తేలలేదని సమాచారం. ఆయా టికెట్ల విషయంలో ఇరువర్గాలు పట్టుబట్టడంతో ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మరో వైపు రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచి వార్డుల్లో ప్రచారం చేస్తున్న ఆశావహులు, తమకు టికెట్లు దక్కుతాయో.. లేదోనని ఆందోళనలో ఉన్నారు.


