ఇటు నామినేషన్లు.. అటు పొత్తు చర్చలు
ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపాలిటీల్లో రెండో రోజైన గురువారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆయా పార్టీల అభ్యర్థులు ఒకవైపు నామినేషన్లు వేస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. సీపీఐ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా, సీపీఎం మాత్రం ఎటూ తేల్చకోలేకపోతోంది. పొత్తుల అంశాన్ని పూర్తిగా ఆయా మున్సిపాలిటీల పార్టీ కేడర్కే అప్పగించింది. ఇదిలా ఉంటే జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు.. 126 వార్డులకు తొలిరోజైన బుధవారం 39 మంది 40 నామినేషన్లు దాఖలు చేయగా, రెండోరోజు ఏకంగా 342 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ తరఫున అభ్యర్థులను ప్రకటించలేదు. బీఫాంలు చేతికివ్వలేదు. ఆయా పార్టీల నుంచి ఆశావహులు నామినేషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఆఖరి రోజైన శుక్రవారం భారీగా దాఖలు చేసే అవకాశం ఉంది.
బీజేపీ ఒంటరిగానే బరిలోకి.. కాంగ్రెస్తో సీపీఐ జత
నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుండటంతో వామపక్షాలు సంస్థాగత పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా, సీపీఐ అధికార కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధమైంది. చేవెళ్లలో రెండు, ఇబ్రహీంపట్నంలో రెండు వార్డుల చొప్పున పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ముఖ్య నేతలు ఇప్పటికే ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుతో చర్చలు జరిపినట్లు తెలిపింది. సీపీఎం మాత్రం పొత్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సంస్థాగత రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా అనువైన (కాంగ్రెస్/బీఆర్ఎస్) పార్టీతో కలిసి పని చేయాలని భావిస్తోంది. పార్టీకి అంతో ఇంతో పట్టున్న ఇబ్రహీంపట్నం సహా ఇతర మున్సిపాలిటీల్లో కనీసం 500 ఓట్లున్న వార్డుల్లో అనువైన పార్టీల మద్దతుతో తమ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రెండో రోజు కొనసాగిన నామినేషన్ల పర్వం
కాంగ్రెస్, బీఆర్ఎస్తో వామపక్ష పార్టీల చర్చలు
హస్తం పార్టీ వైపు సీపీఐ మొగ్గు
ఎటూ తేల్చుకోలేని స్థితిలో సీపీఎం
రెండో రోజు నామినేషన్లు ఇలా..
మున్సిపాలిటీ నామినేషన్లు
ఆమనగల్లు 41
షాద్నగర్ 58
చేవెళ్ల 52
మొయినాబాద్ 77
శంకర్పల్లి 40
ఇబ్రహీంపట్నం 74
మున్సిపాలిటీ టోల్ ఫ్రీ నంబర్లు
ఆమనగల్లు 90323 05567
చేవెళ్ల 94933 21468
ఇబ్రహీంపట్నం 90321 23653
మొయినాబాద్ 76610 97839
షాద్నగర్ 91824 03236
శంకర్పల్లి 73867 55646
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం ఆయా మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కంట్రోల్ రూమ్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఫిర్యాదులు స్వీకరించి, రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


