ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మొయినాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వి.పాండుగౌడ్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సోమ వారం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు ఐడీ కార్డులు, 250 గజాల ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హామీలు అమలు చేయడం లేదన్నారు. వెంటనే అమలు చేయలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఉద్యమకారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి యాలాల మహేశ్వర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి రమేష్, మండల అధ్యక్షుడు న్యాలటి మహిపాల్ పాల్గొన్నారు.


