రిజర్వేషన్ల సాధనకు సమష్టి పోరు
మీర్పేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు దాసరి బాబు పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారికి ఆదివారం మీర్పేట కూడలిలో సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడాన్ని తట్టుకోలేకనే ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. అతని మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ఇకనైనా బీసీలంతా ఐకమత్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకుని రాజ్యాధికారి సాధించాలన్నారు. కార్యక్రమంలో బహుజన ఐక్య వేదిక కార్యదర్శి రాజలింగం, విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరిచారి, నాయకులు రఘు, శేఖర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకయ్య, మల్లికార్జున్, నవీన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


