
దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
షాద్నగర్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది దివ్యాంగులు ఉన్నారని, వారు న్యాయమైన హక్కుల సాధనకు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ను మార్చాలని కోరారు. దివ్యాంగులపై వేధింపులు అధికమవుతున్నాయని, రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో భవిత కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
విజయ్ దేవరకొండపై ఠాణాలో ఫిర్యాదు
షాద్నగర్రూరల్: గిరిజన జాతిని అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు విజయ్దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్హెచ్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎస్ఐ దేవరాజ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మోహన్నాయక్ మాట్లాడుతూ.. సమాజంలో ఎంతో ఉన్నత విలువలు, సంస్కృతి, ఆచారాలను పాటిస్తున్న ఏకైక జాతి గిరిజన జాతి మాత్రమేనన్నారు. అలాంటి గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా విజయ్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఫిర్యాదు చేసిన వారిలో సంఘం నాయకులు సంతోష్నాయక్, చందర్నాయక్, జర్పుల రాజునాయక్, బాబురాజ్నాయక్, పరశురాంనాయక్, శ్రీనివాస్, అంబాదాస్ ఉన్నారు.
అంటరానితనాన్ని నిర్మూలించాలి
బొంరాస్పేట: శాస్త్ర సాంకేతికత రంగం కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో సైతం గ్రామాల్లో కుల వివక్ష ఉండడం అత్యంత దారుణమని ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని ఏర్పుమళ్లలో డా.బీఆర్.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంటరానితనం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులు, పేదల భూములు కాపాడేందుకు సీఎం రేవంత్రెడ్డి జుడీషియల్ కమిటీ వేసి కాపాడాలని కోరారు. కట్టెల మల్లేశం, బైరెడ్డి సతీష్, కాంగ్రెస్ పార్టీ జాతీయ యూత్ కోఆర్డినేటర్ కృష్ణంరాజు పాల్గొన్నారు.