సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
శాతవాహన యూనిర్సిటీ లా ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగస్టు మూడో తేదీ నుంచి ఆరో సెమిస్టర్ పరీక్షలు అంటూ బుధవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించిన వర్సిటీ అధికారులు న్యాయ విద్యార్థుల నెత్తిన పిడుగేశారు. ఈ సెమిస్టర్ సెకండ్ ఇంటర్నల్ 31వ తేదీన, మరునాడు ఆగస్టు 1న మూట్ కోర్ట్ ప్రాక్టీస్ షెడ్యూల్ గత వారమే విడుదలైంది. అయితే, విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కడుతూనే ఉన్నారు. జూలై 31 వరకు విద్యార్థులకు, ఆగస్టు 1వ తేదీన పరీక్షలకు ఆన్లైన్లో ఫీజు గడువు విధించారు. వాస్తవానికి ఆగస్టు 1 శనివారం రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో చెల్లింపులకు అవకాశమిచ్చారు. అదే ఆగస్టు 3న ఉదయం 10 గంటల నుంచి ఆరో సెమిస్టర్ తొలి పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ అధికారులు కనీసం విద్యార్థులకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తీవ్ర వివాదం రేపుతోంది.
సెంటర్ ఎక్కడ..? హాల్టికెట్ ఎలా?
శనివారం సాయంత్రం వరకు పరీక్ష ఫీజు కట్టించుకునేలా షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు, సోమవారం ఉదయం 10 గంటలకు పరీక్ష పెట్టడంపై విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తాము హాల్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి..? సెంటర్ ఎక్కడ? అన్న కనీస విషయాలు తెలసుకునే వీలు లేకుండా పరీక్షకు షెడ్యూల్ విడుదల చేయడంపై విద్యార్థులు బిత్తరపోతున్నారు. కేవలం 24 గంటల్లో హాల్టికెట్లు ఎలా విడుదల చేస్తారు? ఎలా పంపిణీ చేస్తారు? అన్న విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఇంటర్నల్ పరీక్షలు పూర్తయిన కనీసం వారం నుంచి 15 రోజుల వ్యవధి అనంతరం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి. కానీ, అధికారులు ఈ విషయాల గురించి కనీసం ఆలోచించనట్లుగా స్పష్టమవుతోంది. ఈ విషయమై శాతవాహన వర్సిటీ పరీక్షల కంట్రోలర్ సురేశ్ను సంప్రదించగా.. ఎల్ఎల్ఎం కౌన్సెలింగ్కు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పలు న్యాయకళాశాలలు, విద్యార్థుల నుంచి అనేక వినతులు వచ్చిన నేపథ్యంలో పరీక్షల ఆల్మోనాక్ (విద్యా వార్షిక ప్రణాళిక)ను మార్చి మరీ ముందుకు జరిపినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు పరీక్షలు ముందుకు జరపడంపై తమకు అభ్యంతరం లేకున్నా.. కనీసం హాల్ టికెట్ తీసుకునే సమయం, పరీక్ష కేంద్రం తెలుసుకునే వ్యవధి అయినా ఇవ్వకపోవడంపై న్యాయ విద్యార్థులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
శాతవాహన న్యాయ పరీక్షల్లో గందరగోళం
ఇంటర్నల్ మరునాటి నుంచే ఆరో సెమిస్టర్ మొదలు
ఆగస్టు ఒకటి వరకు ఫీజు చెల్లింపు
మూడో తేదీన ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు
హాల్టికెట్ తీసుకునే సమయమూ ఇవ్వని అధికారులు


