సిరిసిల్ల: జిల్లా అంతటా మంగళవారం మోస్తరు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బోయినపల్లి మండలంలో 55.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 11.9, చందుర్తి 14.7, వేములవాడరూరల్ 42.7, వేములవాడ 44.5, సిరిసిల్ల 15.3, కోనరావుపేట 43.6, వీర్నపల్లి 38.9, ఎల్లారెడ్డిపేట 10.4, గంభీరావుపేట 15.6, ముస్తాబాద్ 19.9, తంగళ్లపల్లి 20.2, ఇల్లంతకుంట 13.2 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 26.6 మి.మీ నమోదైంది. జిల్లాలో మంగళవారం వరకు సాధారణ వర్షపాతం 335.1 మి.మీ కాగా, ఇప్పటి వరకు 236.9 మి.మీ వర్షం కురిసింది. జిల్లా అంతటా 29మి.మీ లోటు వర్ష ఉంది. కాగా, బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు
సిరిసిల్ల: మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, యువత డ్రగ్స్కు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారిని గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో స్నేహభావం
సిరిసిల్ల అర్బన్: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ చటర్జీ అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్ధాపూర్ బెటాలియన్లో ఇంటర్ కంపెనీస్ అన్నుయల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరై మాట్లాడారు. సిబ్బందిలో ఒత్తిడి తగ్గించేందుకు ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బహుమతులు అందిస్తున్నట్లు వివరించారు. క్రీడా పోటీలతో విధి నిర్వహణలో సిబ్బంది చురుకుగా పనిచేస్తారన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాసు, ఎస్.సురేశ్, ఎం.రాజు, ఆర్ఐలు రామబ్రహ్మం, శ్రీనివాస్, కుమారస్వామి, శ్యాంరావు పాల్గొన్నారు.
కథల పోటీల్లో జాతీయస్థాయి బహుమతి
గంభీరావుపేట(సిరిసిల్ల): ఉషాబాల పత్రిక వారు నిర్వహించిన పిల్లల కథల పోటీల్లో గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పర్ష వర్షిక జాతీయ స్థాయి బహుమతికి ఎంపికై ంది. తాను రాసిన పట్టుదల అనే కథ అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన ఓ విద్యార్థి జీవితాన్ని కథ రూపంలో రాసి జాతీయస్థాయికి ఎంపికై ంది. రిషికను హెచ్ఎం గంగారాం, ఉపాధ్యాయులు అభినందించారు.
ఎంజేపీటీబీసీలో నేడు స్పాట్ అడ్మిషన్లు
సిరిసిల్ల: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీ సీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ సుస్మిత తెలిపారు. సిరిసిల్ల ఎంజేపీటీబీసీ సంక్షేమ గురుకులంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని వివరించారు. బీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడునని, ఎస్సెస్సీలో 450 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్పాట్ అడ్మిషన్కు రావాలని పేర్కొన్నారు.


