● ఎన్యూమరేషన్ ఫారాల్లో పొరపాట్లు ● దిద్దుబాటు బాధ్యతల్లో స్వచ్ఛంద సేవకులు
వేములవాడ: ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుంది. ఎన్యూమరేషన్ ఫారాలలో పలు రకాల తప్పులు దొర్లడంతో వాటిని సరిదిద్దడం సిబ్బందికి సవాలుగా మారింది. దరఖాస్తుదారులతో పాటు బీఎల్ఏలు, బీఎల్వోలు పూర్తి చేసిన ఫామ్స్లలోనూ తప్పులు దొర్లడంతో వాటిని సవరించేందుకు స్వచ్ఛంద సేవకులు తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఫామ్స్ నింపడం సులువని, దిద్దడం తలనొప్పిగా మారిందని వాపోతున్నారు.
అవగాహన లోపం
ఓటర్ల నుంచి స్వీకరించిన ఫారాలలో పలుచోట్ల అసంపూర్తి వివరాలు, తప్పుడు సమాచారం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఓటరు వివరాల కాలమ్లో పాత, కొత్త ఎపిక్ సంఖ్యలు తారుమారు కావడం, కుటుంబ సభ్యులు, బంధుత్వాల వివరాలు సక్రమంగా పూరించకపోవడం, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం సంఖ్యలను తప్పుగా రాయడం, వివాహమై వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాల నమోదులో స్పష్టత లేకపోవడం, కొన్ని చోట్ల ఆధార్ సంఖ్యలు, ఫోన్ నంబర్లు అరకొరగా నమోదు చేయడంతో ప్రక్రియ మందగించింది.
స్వచ్ఛంద సేవకుల సేవలు అమోఘం
ఎన్యూమరేషన్ ఫారాలలో తప్పులను సరిదిద్దేందుకు స్వచ్ఛంద సేవకుల సేవలను తహసీల్దారు కార్యాలయంలో వినియోగించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటి నుంచి తెప్పించిన ఫారాల్లోని తప్పులను సరిచూడడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడం వంటి పనుల్లో పలువురు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
మూడో తేదీ చివరి అవకాశం
ఎస్ఐఆర్ ఫారాల దాఖలు, దిద్దుబాట్లకు ఆగస్టు 3 వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమ ఓటు వివరాల్లో ఏమైనా తప్పులు, మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్వో లేదా అధికారిక పోర్టల్ ద్వారా సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.


