తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వేములవాడ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.సాయికుమార్
వేములవాడరూరల్: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం వేములవాడ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.సాయికుమార్ సూచించారు. జూలై 23 నాటికి జిల్లాలో సాధారణంగా 283.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 190.4 మి.మీ నమోదై, 33 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలోని 13 మండలాలకు 11 మండలాల్లో లోటు వర్షపాతం, రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా రుద్రంగిలో 48 శాతం, ఇల్లంతకుంట 46, తంగళ్లపల్లి 44, సిరిసిల్ల 43, బోయినపల్లి 38, వేములవాడరూరల్ 36, వీర్నపల్లి 16, కోనరావుపేటలో 18 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లా సగటు భూగర్భ జల మట్టం గతేడాదితో పోలిస్తే 2.91 మీటర్లు లోతుకు వెళ్లిందని వివరించారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు వేసుకోవడం ఉత్తమమన్నారు. అవసరమైన చోట డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులు వినియోగించాలని సూచించారు.
భూగర్భ జలాల మట్టం ఇలా..
మండలం మీటర్లు
వేములవాడఅర్బన్ 21.38
సిరిసిల్ల 18.38
వీర్నపల్లి 18.06
ఎల్లారెడ్డిపేట 17.74
గంభీరావుపేట 13.16
తంగళ్లపల్లి 12.54
ముస్తాబాద్ 12.04
కోనరావుపేట 11.54
రుద్రంగి 10.44
ఇల్లంతకుంట 9.22
చందుర్తి 8.53
వేములవాడరూరల్ 8.10
బోయినపల్లి 7.82


